SAKSHITHA NEWS

గల్ఫ్ మృతుల ఎక్స్ గ్రేషియా చెల్లింపుకు రూ.10 కోట్ల 60 లక్షలు కేటాయింపు 

…..

సాక్షిత : గల్ఫ్ జీవో ప్రతులను విడుదల చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ 

రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా దేశ చరిత్రలోనే ప్రథమం

గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు మార్గదర్శకాల జీవో ప్రతులను బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో టీపీసీసీ ఎన్నారై సెల్ నేతలు డా. బిఎం వినోద్ కుమార్, మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస్ రావ్ లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై అధికారి ఇ. చిట్టిబాబు ఉన్నారు. గల్ఫ్ మృతుల వారసులకు ఎక్స్ గ్రేషియా (మృతధన సహాయం) చెల్లింపుకు ప్రభుత్వం రూ.10 కోట్ల 60 లక్షలు కేటాయించిందని, జిల్లా కలెక్టర్ల ద్వారా చెల్లింపులు చేస్తామని మంత్రి తెలిపారు. 

ఈ సందర్బంగా టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన గల్ఫ్ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేసిందని అన్నారు. మంత్రి పొన్నం చొరవ తీసుకొని గల్ఫ్ సంక్షేమ జీవోల విడుదలకు కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు ఏ రాష్ట్రంలో లేదని, ఇది దేశ చరిత్రలోనే ప్రథమం అని డా. వినోద్ అన్నారు.

తెలంగాణలో కాంగ్రేస్ ప్రభుత్వం ఏర్పడిన 2023 డిసెంబర్ 7 తర్వాత మృతి చెందిన గల్ఫ్ కార్మికుల వారసులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రూ.5 లక్షల మృతధన సహాయం కోసం దరఖాస్తు చేరుకోవాలని టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి కోరారు గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకోవడానికి కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులకు, సహకరించిన ప్రతి ఒక్కరికి గల్ఫ్ సంఘాలు, గల్ఫ్ కార్మికులు, గల్ఫ్ జెఏసి పక్షాన భీంరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 

టీపీసీసీ ఎన్నారై సెల్ బృందం సాధారణ పరిపాలన శాఖ (జిఏడి – ఎన్నారై) ప్రభుత్వ కార్యదర్శి యం. రఘునందన్ రావు, జిఏడి ఎన్నారై ప్రోటోకాల్ విభాగం జాయింట్ సెక్రెటరీ డా. ఎస్. హరీష్, ఎన్నారై అధికారులు బిబిఆర్ కార్తీక్, ఇ. చిట్టిబాబు, రూప లను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను కలిసి అభినందనలు తెలిపారు.


SAKSHITHA NEWS