SAKSHITHA NEWS

నన్నయలో వన మహోత్సవం
సాక్షిత రాజానగరం, :
ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఎన్.ఎస్.ఎస్ విభాగం ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీసీ ఆచార్య వై శ్రీనివాసరావు హాజరై విశ్వవిద్యాలయ పరిపాలన భవనం ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ చెట్ల ఆవశ్యకత పట్ల విద్యార్థులకు అవగాహన పెంచాలన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించాలన్నారు. పచ్చని చెట్లు ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి, ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ, ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగపరచుకోవాలన్నారు.

మొత్తం నన్నయ ప్రాంగణాన్ని ఆర్ట్స్ అండ్ కామర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్ కళాశాలల విద్యార్థులకు విభజించి మొక్కలు నాటించి వాటిని పరిరక్షించే కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పారు. విద్యార్థులంతా మొక్కలు నాటి వాటిని పర్యవేక్షిస్తూ నన్నయ విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని ప్రకృతి ఒడిగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్, ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా.పి.వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్స్ ఆచార్య డి. జ్యోతిర్మయి, డా.పి.విజయనిర్మల, ఇంజనీర్ డా.కె.నూకరత్నం, ఎన్.ఎస్.ఎస్ పీఓలు డా.ఎం.గోపాలకృష్ణ, డా.ఎన్.రాజ్యలక్మీ, డా.ఎల్. ముత్యాలనాయుడు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS