SAKSHITHA NEWS

19 నుండి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

రాజమహేంద్రవరం, సాక్షిత :

19నుంచి 26వరకు ఇస్కాన్ శ్రీ శ్రీ రాధాగోపీనాథ్ దశావతార మందిర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు శ్యామాంగ శ్రీనివాస్ దాస్, హేమ నిమాయదాస్ చెప్పారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తిచేసామన్నారు. ఇస్కాన్ లో శనివారం ఉదయం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతిరోజూ సా. 4 గం.లకు విశ్వశాంతి మహా యజ్ఞము, అనంతరం దేవాదిదేవుడు శ్రీకృష్ణుని లీలా కథామృతముపై ప్రవచనం, వాహన సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు, ఊంఝల సేవ ఉంటాయని చెప్పారు. తొలిరోజు 19వ తేదీన శ్రీ బలరామ జయంతి మహోత్సవం సందర్భంగా ఉదయం
11గంటలకు శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రాదేవికి మహాకుంభాభిషేకము, అనంతరం శ్రీ బలరాముని లీలలపై ప్రవచనము, మహాహారతి తదనంతరం మహా ప్రసాద వితరణ ఉంటాయని తెలిపారు.

శ్రీ కృష్ణ జన్మాష్టమి ఉత్సవ రోజులలో స్వామి వారి దర్శనం ఉదయం 7.30 గంటల నుండి రాత్రి 9 గం. ల వరకు ఉంటుందని శ్యామాంగ శ్రీనివాస్ దాస్, హేమ నిమాయదాస్ చెప్పారు. 19న పల్లకి సేవ, 20న చంద్రప్రభ వాహన సేవ, 21న సూర్యప్రభ వాహన సేవ, 22న అశ్వవాహన సేవ, 23న గజవాహన సేవ 24న హనుమత్ వాహన సేవ, 25 న గరుడ వాహన సేవ, 26 న అనంత శేష వాహన సేవ ఉంటాయని వారు వివరించారు. 26వ తేదీ సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తెల్లవారుఝామున 4.30 . మహామంగళహారతితో ప్రారంభించి,

వివిధ కార్యక్రమాలుంటాయని తెలిపారు. మధ్యాహ్నం 12 గం. లకు శ్రీకృష్ణ జన్మాష్టమి పోటీలలో విజేతలకు జిల్లా కెలెక్టర్, జిల్లా ఎస్పీ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, అలాగే ప్రజా ప్రతినిధుల చేతులమీదుగా బహుమతి ప్రధానోత్సవం జరుగుతుందని తెలిపారు. మధ్యాహ్నం 3 గం. లకు ఉట్టి ఉత్సవము, అనంతరం వాహన సేవ, తెప్పోత్సవం, శ్రీకృష్ణ లీలామృత ప్రవచనము, రాత్రి 10.30 గం. లకు శ్రీశ్రీ రాధాగోపీనాథులకు మహాకుంభాభిషేకము, మహాప్రసాద వితరణ ఉంటాయని వారు వివరించారు. ఇస్కాన్ సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాదుల వారి ఆవిర్భావ మహోూత్సవము సందర్బంగా ఈనెల 27వ తేదీ ఉదయం 9. గంటలకు మహా అన్నప్రసాద వితరణ ఉంటుదని తెలిపారు. ఈ కార్యక్రమా లలో భక్తులు పాల్గొని దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుని కృపకు పాత్రులు కావాలని కోరారు.


SAKSHITHA NEWS