SAKSHITHA NEWS

15 ఏళ్లు దాటిన వాహనాలకు రోడ్లపైకి నో పర్మిషన్: జనవరి నుంచి అమలుకు రేవంత్ సర్కార్ ప్లాన్

కాలుష్యానికి కారణమయ్యే వాహనాలను స్క్రాప్ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. 2025 జనవరి 1 నుంచి 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉన్న వాహనాలను, ఫిట్ నెస్ పరీక్షల్లో ఫెయిలైన వాహనాలను రోడ్లపైకి అనుమతించరు. లేదా ఇలాంటి వాహనాలను రిజిస్ట్రేషన్ కూడా చేయవద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

వాహనాలకు ఫిట్ నెస్ పరీక్షలు

ఫిట్ నెస్ పరీక్షల్లో పాసైన వాహనాలు గ్రీన్ ట్యాక్స్ చెల్లిస్తే మరో మూడు నుంచి 5 ఏళ్ల పాటు పనిచేసేందుకు అనుమతిస్తారు. అయితే 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలను కూడా స్క్రాప్ చేయనున్నారు. ఇలాంటి వాహనాలను ప్రభుత్వ శాఖల్లో 10 వేలు ఉన్నాయి. దిల్లీలో మాత్రమే ప్రస్తుతం 15 ఏళ్లు దాటిన వాహనాలను రోడ్లపైకి అనుమతించడం లేదు. కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ సహా ఇతర రాష్ట్రాలు ప్రతిపాదించిన విధానాలను తెలంగాణలో కూడా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

గ్రేటర్ లో 20 లక్షల వాహనాలు

తెలంగాణలో 15 ఏళ్లు దాటిన వాహనాలు 30 లక్షలకు పైగా ఉన్నాయి. అయితే గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలోనే ఈ వాహనాలు 20 లక్షలున్నాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 17 లక్షల ద్విచక్రవాహనాలు, 3.5 లక్షల కార్లు, లక్ష గూడ్స్ క్యారేజీలు, 20 వేల ఆటోరిక్షాలున్నాయి.

స్క్రాప్ చేయాల్సిన లిస్ట్ లో 1000 ఆర్టీసీ బస్సులు

15 ఏళ్లు దాటిన వాహనాల జాబితాలో వెయ్యి ఆర్టీసీ బస్సులున్నాయి. పలు విద్యా సంస్థల బస్సులు 2 వేలు 15 ఏళ్లు దాటినట్టుగా అధికారులు గుర్తించారు. పాత వాహనాలను స్క్రాప్ చేసిన యజమానులకు మోటార్ వాహనాల పన్నుపై 10 నుంచి 15 శాతం వరకు రాయితీని ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.

కేంద్ర రోడ్డు రవాణ, రహదారుల మంత్రిత్వ శాఖ నివేదిక మేరకు 15 ఏళ్లు దాటిన వాహనాలతో వెయ్యి రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. 2022లో ఈ వాహనాలతో 1,306 ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 418 మంది చనిపోయారు. ముఖ్యంగా 15 ఏళ్లు పైబడిన వాహనాలు తరచుగా పాడైపోతున్నాయని రోడ్డు భద్రతా నిపుణులు చెబుతున్నారు.


SAKSHITHA NEWS