విధ్వంసానికి చిరునామా రేవంత్ రెడ్డి వెయ్యి రోజుల పాలన..
నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసిన మహోన్నత వ్యక్తి కేసీఆర్..
నిరుపేదల సంక్షేమ పథకాలను నిలిపివేశారు..
నోటీసుల పేరుతో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులను నరకయాతనకు గురి చేస్తున్నారు..
వచ్చేది మన ప్రభుత్వమే.. అన్ని సంక్షేమ పథకాలను అందిస్తాం..
నీటి బిల్లుల మాఫీకి కృషి..
అర్ధరాత్రి ఫోన్ చేసినా అందుబాటులో ఉంటాం..
అవసరమైన సమయంలో మీ శక్తిని చూపించండి..
పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ సముదాయంలో బిఆర్ఎస్ నిరసన గళం
రామచంద్రాపురం
ప్రజలు నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం అందిస్తే.. పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తూ విధ్వంస పాలన కొనసాగిస్తోందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ 420 మోసాల పైన బిఆర్ఎస్ పార్టీ పోరు బాటలో భాగంగా.. తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరు కేసీఆర్ నగర్ డబల్ బెడ్రూమ్స్ ఫేస్ టూ లో తాగునీరు, విద్యుత్, బస్తీ దవాఖానాల అంశంపై నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ..పటాన్చెరు నియోజకవర్గంలో సుమారు 38 వేల డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం జరిగిందని, పేదల సొంతింటి కలను సాకారం చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. పేదలకు ఇళ్లు నిర్మించేందుకు సుమారు 600 ఎకరాల భూమిని అందించి, కేవలం మూడేళ్లలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించినట్లు తెలిపారు.
పేదల సొంతింటి కలను సాకారం చేయడం ఆషామాషీ వ్యవహారం కాదని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పేదల సంక్షేమ కోసం వినూత్న పథకాలను ప్రవేశపడితే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
నోటీసుల పేరుతో వేధిస్తే సహించేది లేదు
డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులకు నోటీసుల పేరుతో ఇబ్బందులు కలిగించడం, కొత్తగా వచ్చిన అధికారులు లేదా సిబ్బంది పేరుతో వేధింపులకు గురిచేయడం సరికాదని ఎమ్మెల్యే జిఎంఆర్ హెచ్చరించారు.
అవసరమైన సమయంలో ప్రజలకు అండగా నిలబడతామని, అర్ధరాత్రి ఫోన్ చేసినా అందుబాటులో ఉండే మీ కుటుంబ సభ్యుడిగా తాను ఉంటానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి భరోసా ఇచ్చారు.
నీటి బిల్లుల మాఫీకి కృషి
కొల్లూరు కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూం సముదాయంలో నెలకొన్న తాగునీటి సమస్యతో పాటు నీటి బిల్లుల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
కాలనీలో అవసరమైన కొత్త డ్రైనేజీ వ్యవస్థ, ఎస్టీపీ (STP) పనులకు సంబంధించిన ప్రణాళికలను పునరుద్ధరించి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అతి త్వరలో అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రతి బ్లాకులో పర్యటించి సమస్యలను అక్కడిక్కడే పరిష్కరిస్తామని తెలిపారు.
వచ్చేది మన ప్రభుత్వమే.. సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తాం..
రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిపివేసిన అన్ని సంక్షేమ పథకాలను పునరుద్ధరించి ప్రజలకు అండగా నిలుస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు.
మీ సొంత ఇంటి కలను సాకారం చేసిన కెసిఆర్ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని.. అవసరమైన సమయంలో మీ శక్తిని చూపించాలని కోరారు.
పేదల సంక్షేమాన్ని విస్మరించి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని, ప్రజల పక్షాన నిరంతరం పోరాటం కొనసాగిస్తామని గూడెం మహిపాల్రెడ్డి స్పష్టం చేశారు.
ఎలాంటి సమస్యలు ఉత్పనమైన తన దృష్టికి తీసుకుని రావాలని.. అర్ధరాత్రి ఫోన్ చేసినా తాను అందుబాటులో ఉంటానని చెప్పడంతో పాటు.. తన వ్యక్తిగత ఫోన్ నెంబర్ సైతం ప్రజలకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST