విద్యార్థుల భద్రతపై అవగాహన కల్పించిన షీ టీమ్….
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, రామగుండం/ : రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి షీ టీమ్ ఆధ్వర్యంలో పెద్దపల్లిలోని ఇండియా మిషన్ హైస్కూల్ విద్యార్థులకు మహిళలు, బాలికల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా షీ టీమ్ ఇన్చార్జి ఎస్ఐ లావణ్య మాట్లాడుతూ విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, టీనేజ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత, పోక్సో చట్టం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సామాజిక మాధ్యమాల ప్రభావం, విద్యార్థుల ప్రవర్తన, మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై వివరించారు.
మహిళలు, బాలికల భద్రత కోసం ప్రతిరోజూ బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు, జనసమ్మర్ధ ప్రాంతాలు, కళాశాలల వద్ద షీ టీమ్ నిఘా ఉంటుందని తెలిపారు. ఎవరైనా వేధింపులకు గురైతే భయపడకుండా 6303923700 నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని, ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
మహిళలకు ప్రమాదం లేదా బెదిరింపులు ఎదురైతే వెంటనే 100 లేదా 112కు ఫోన్ చేయాలని, ఆన్లైన్ మోసాలకు గురైతే 1930కు సమాచారం అందించాలని సూచించారు. మహిళలు ప్రయాణ సమయంలో భద్రత కోసం టీ-సేఫ్ యాప్ను వినియోగించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జయరాజ్, ఉపాధ్యాయులు, షీ టీమ్ సభ్యులు సురేష్, మౌనిక, స్నేహలత తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
