నాణ్యతలో రాజీ లేదు.. చిరకాలం మన్నే రోడ్లే లక్ష్యం….
కృష్ణానగర్లో రూ.40 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం….
–మేయర్ మహంకాళి స్వామి…
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, రామగుండం : నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా ప్రజలకు చిరకాలం ఉపయోగపడేలా రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు.
34వ డివిజన్ కృష్ణానగర్లో ఎన్టీపీసీ–సీఎస్ఆర్ నిధులు రూ.40 లక్షల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ స్వప్న ప్రియ భరత్ గౌడ్తో కలిసి మేయర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. గతంలో ఎన్టీపీసీ–సీఎస్ఆర్ నిధులు ఇతర ప్రాంతాలకు తరలిపోయేవని, రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన చొరవతో ప్రభావిత ప్రాంతమైన రామగుండంలోనే సీఎస్ఆర్ నిధులు ఖర్చు చేసేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
ఎమ్మెల్యే ఆదేశాలతో ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతాల్లో సీఎస్ఆర్ నిధులతో యూజీడీ, రోడ్లు, నీటి సరఫరా పైప్లైన్లు, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక వసతుల పనులు చేపడుతున్నామని అన్నారు. రామగుండం నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ప్రజాప్రతినిధులంతా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
మౌలిక వసతులకు సంబంధించి ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చే సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని మేయర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గట్ల రమేష్, నాయకులు ఆసిఫ్ పాషా, అభిషేక్, గడ్డం శ్రీనివాస్, విజయ్, నగరపాలక సంస్థ ఏఈ మీర్, కాంట్రాక్టర్లు కృపాకర్ రావు, శశికాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST