కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు కాదు.. ఆరు మోసపూరిత హామీలు: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని నిరసిస్తూ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి మాదాపూర్ డివిజన్ ఖానామెట్ చందా నాయక్ నగర్ తండాలో నిర్వహించిన “కాంగ్రెస్ వి ఆరు గ్యారంటీలు కాదు.. కాంగ్రెస్ వి ఆరు మోసపూరిత హామీలు” నిరసన కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ బాలమల్లు తో కలిసి మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాకీ కార్డులు, ప్లే కార్డులు ప్రదర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ, వాటిని ఎప్పటిలోగా అమలు చేస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక భృతి, కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ పథకాలలో తులం బంగారం, విద్యార్థినులకు స్కూటర్లు, గృహజ్యోతి పథకం, అర్హులైన పేదలకు సొంత ఇళ్లు వంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిందని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పేర్కొన్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో మహిళలు, విద్యార్థులు, పేద కుటుంబాలు తీవ్ర నిరాశకు గురవుతున్నారని అన్నారు.
“ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుంది. ప్రజల తరఫున మా పోరాటం నిరంతరం కొనసాగుతుంది” అని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మహిళలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు..


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST