మార్చి నాటికి ఆర్అండ్బీ పనులన్నీ పూర్తి చేయాలి…
నాణ్యతలో రాజీ వద్దు.. పనుల్లో జాప్యం సహించేది లేదు…..
— కలెక్టర్ కోయ శ్రీహర్ష…
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి,పెద్దపల్లి/ : జిల్లాలో రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అన్ని అభివృద్ధి పనులను వేగవంతం చేసి వచ్చే మార్చి నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడవద్దని స్పష్టం చేశారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఆర్అండ్బీ శాఖ పనుల పురోగతిపై ఏఈలు, డీఈలు, సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని మండలాల్లో కొనసాగుతున్న రహదారులు, భవనాలు, ఇతర ఆర్అండ్బీ పనుల పురోగతిని మండలాల వారీగా సమీక్షించారు. ప్రారంభం కాని పనులు, వివిధ దశల్లో ఉన్న పనులు, పెండింగ్లో ఉన్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న అన్ని ఆర్అండ్బీ పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకుంటూ పనులు సకాలంలో పూర్తయ్యేలా అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.
ప్రజలకు నాణ్యమైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యంగా పనులు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా రహదారి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని అధికారులను ఆదేశించారు. నిబంధనల ప్రకారం పనులను ఎప్పటికప్పుడు తనిఖీ చేయడంతో పాటు పనుల పురోగతి, నాణ్యత, బిల్లుల చెల్లింపులను సమర్థవంతంగా పర్యవేక్షించాలని సూచించారు.
ప్రతి పనికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని తెలిపారు. ప్రతి మండలంలోని ఆర్అండ్బీ పనులకు నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ప్రారంభం కాని పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవడంతో పాటు వివిధ దశల్లో ఉన్న పనులను వేగవంతం చేయాలని, పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడే నాణ్యమైన రహదారులు, భవనాలను అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
సమావేశంలో ఆర్అండ్బీ ఈఈ భావ్ సింగ్, ఏఈలు, డీఈలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST