తిరుమల పార్వేట మండపంలో వనభోజనం
సాక్షిత ప్రతినిధి – తిరుమల: కార్తీక వన భోజన కార్యక్రమం ఆదివారం (నేడు) తిరుమలలోని గోగర్భం సమీపంలో గల పార్వేటమండపంలో జరగనుంది. పవిత్రమైన కార్తీకమాసంలో వనభోజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఇందులో భాగంగా ఉదయం 8.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు చిన్న గజవాహనంపై, ఉభయనాంచారులు పల్లకిపై ఆలయంనుంచి బయలుదేరి ఊరేగింపుగా పార్వేటమండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 నుంచి 12 గంటల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహిసారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. ఆతర్వాత మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి అలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకారసేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొంటారు.

