కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు నిర్వాహకులు సహకరించాలి………. అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్
సాక్షిత వనపర్తి :
వరి ధాన్యం విక్రయించడానికి కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు నిర్వాహకులు సహకరించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్ అన్నారు.
కొత్తకోటలోని పాక్స్ వరి కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ రెవెన్యూ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని అన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని తెలియజేశారు. కాబట్టి రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే తమ వరి ధాన్యాన్ని విక్రయించాలని తెలియజేశారు.
వరి ధాన్యం విక్రయించడానికి కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు నిర్వాహకులు సహకరించాలని సూచించారు. రైతులు పంట తెచ్చిన రోజు రిజిస్టర్లలో ఏ రోజు తెచ్చారు, తెచ్చినప్పుడు ఎంత తేమశాతం ఉంది అనే వివరాలను నమోదు చేసుకుని, సీరియల్ నెంబర్ల వారీగా కొనుగోలు చేసి పంపించాలన్నారు. బరువు కొల్చే యంత్రాలు, తేమ యంత్రాలు అందుబాటులో ఉంచుకొని ఎప్పటికప్పుడు ధాన్యాన్ని కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలన్నారు. వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియడం లేదని కావున కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్లను అందుబాటులో ఉంచుకోవాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. నిర్దేశించిన తేమ శాతం వచ్చిన వెంటనే తూకం చేసి కేటాయించిన మిల్లుకు తరలించాలని సూచించారు.
జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కాశీ విశ్వనాథ్, డి ఎం జగన్ మోహన్ ఇతర అధికారులు తదితరులు అదనపు కలెక్టర్ వెంట ఉన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
