రోడ్డు ప్రమాదాల నియంత్రణకు మనమంతా కలిసి కట్టుగా పని చేయాలి….
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సహా పలు సంక్షేమ పథకాల అమలు…
–జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష…
సాక్షిత పెద్దపల్లి//
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎంబీ గార్డెన్స్ లో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన పేరిట పాలన కొనసాగుతుందని, ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నూతన రేషన్ కార్డుల జారీ, సన్న బియ్యం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పింఛన్లు, గృహ జ్యోతి, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, ఇందిరా మహిళా శక్తి పేరిట వడ్డీ లేని రుణాలు వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.
ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడానికి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజల నుండి సూచనలు స్వీకరించి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.
మున్సిపల్ వార్డుల్లో ప్రజలకు ఉన్న సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని, ప్రభుత్వ పథకాల అమలులో లోపాలు ఉంటే వెంటనే యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయని పేర్కొన్న కలెక్టర్, తీవ్రవాద దాడులు లేదా ఘోర రోగాల కంటే రోడ్డు ప్రమాదాల వల్ల మరణాలు ఎక్కువగా ఉండటం ఆందోళనకరమని అన్నారు. ప్రమాదాల నియంత్రణకు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం “ఏరైవ్-ఏలైవ్” కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నివారణ, ఓవర్ స్పీడింగ్ తగ్గించడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం వంటి ట్రాఫిక్ నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల సమయంలో గోల్డెన్ అవర్లోపు బాధితులను ఆసుపత్రికి తరలిస్తే రహ వీర్ పథకం కింద రూ.25,000 ప్రోత్సాహకం అందిస్తామని, అలాగే బాధితులకు సమీప ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.1.5 లక్షల వరకు ఉచిత చికిత్స సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిసిపి రాంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, మున్సిపల్ కౌన్సిలర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY