పల్నాడు జిల్లా, చిలకలూరిపేట
ఆగస్ట్ 27వ తేదీ నాడు వినాయక చవితి పండుగ సందర్భంగా చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు ముందుగా చిలకలూరిపేట అర్బన్ సీఐ రమేష్, రూరల్ సీఐ సుబ్బనాయుడు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐలు రమేష్, సుబ్బనాయుడు మీడియాతో మాట్లాడుతూ ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రతిష్టాత్మకంగా భక్తులు పెట్టుకునే వినాయక చవితి మండపాలకు మరియు మండపాలు నిర్వహించే కమిటీ సభ్యులకు పలు జాగ్రత్తలు, సూచనలు తెలియజేశారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో వినాయకుడి మండపాలు నిర్వహించే వారు తప్పనిసరిగా పోలీస్ శాఖ మరియు సంబంధిత శాఖ అధికారుల అనుమతులు తీసుకోవాలని తెలియజేశారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వినాయకుని మండపాలు నడిరోడ్లపై పెట్టరాదు అన్నారు. అదేవిధంగా వినాయకుని ఎత్తు, బరువు మరియు మండపాలు ఎన్ని రోజులు కమిటీ సభ్యులు పెడతారో వాటి పూర్తి వివరాలు నిమజ్జనానికి వెళ్లే రూట్ మ్యాపు ఇలా ప్రతి ఒక్కటి పోలీస్ వారికి ముందుగానే తెలియజేయాలన్నారు. ముఖ్యంగా డీజే లతో ప్రతిధ్వని చేస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగించవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా వినాయకుని నిమజ్జనం రోజున వేషధారణలతో ప్రతిధ్వని కలిగిస్తూ డీజే లతో మద్యం తాగుతూ విచ్చలవిడిగా బాంబులు కాలుస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఆ మండపం కమిటీ సభ్యుల పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. వినాయకుని మండపంలో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తే వెంటనే కమిటీ సభ్యులు సంబంధిత పోలీస్ స్టేషన్ కు తెలియజేయాలన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో భక్తులు, మండపాలు నిర్వహించుకునే ప్రతి ఒక్కరూ ఆ లంబోదరుడి సేవలో కరుణాకటాక్షాలు పొందుతూ ప్రశాంతంగా వినాయక చవితి పండుగను జరుపుకోవాలని చిలకలూరిపేట అర్బన్ సీఐ రమేష్ మరియు రూరల్ సీఐ సుబ్బ నాయుడు తెలిపారు.
