ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టీఆర్పీ మద్దతు

సూర్యాపేట డిపో వద్ద కార్మికులకు సంఘీభావం తెలిపిన వట్టే జానయ్య యాదవ్
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట డిపోలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు రాజకీయ మద్దతు లభిస్తోంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ స్వయంగా సమ్మె స్థలానికి చేరుకుని కార్మికులకు సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంవత్సరాలుగా ప్రజలకు సేవలందిస్తున్న ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులను నిర్లక్ష్యం చేయడం అనేది దురదృష్టకరమని పేర్కొంటూ, వారి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కార్మికుల హక్కుల కోసం TRP పార్టీ ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్న ఆయన, ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ప్రభుత్వం వెంటనే చర్చలకు ముందుకు వచ్చి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో TRP జిల్లా అధ్యక్షులు మామిడి అంజయ్య, మహిళా విభాగం అధ్యక్షురాలు కొన్నే మంజుల గౌడ్, ఆత్మకూరు (ఎస్) మండల అధ్యక్షులు బొల్లె సైదులు, వల్లాల సైదులు యాదవ్, లింగాల సైదులు, నేలచర్ల మధు ప్రజాపతి తదితరులు పాల్గొన్నారు. కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు మరియు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మొత్తానికి, సూర్యాపేటలో ఆర్టీసీ సమ్మె మరింత ఉత్కంఠగా మారుతోంది. ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుందో అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
