టేకుమట్ల సన్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో దొంగతనం… రైతన్న కన్నీళ్లు
….
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలోని నూతన ఖమ్మం హైవే వద్ద ఉన్న సన్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో భారీ దొంగతనం వెలుగులోకి వచ్చింది. పదిరోజుల క్రితం తన 10 పుట్ల సన్న ధాన్యాన్ని అమ్మకానికి పోసుకున్న రైతు కోడకండ్ల అనిల్ రెడ్డి (S/o సైదిరెడ్డి) మంగళవారం ఉదయం కేంద్రానికి వచ్చేసరికి షాక్కు గురయ్యాడు. ధాన్యం మెయిచర్ రావడంతో పట్టాలు కప్పడానికి వచ్చిన రైతు, తన ధాన్యంలో సుమారు నాలుగు పుట్లు (24 క్వింటాల్) మాయమైపోయినట్లు గుర్తించాడు. ఈ విషయాన్ని గమనించిన వెంటనే అనిల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగులు రాత్రి వేళ కేంద్రంలో చొరబడి ధాన్యాన్ని దోచుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పటికీ ఒకటి, రెండు బస్తాల నష్టాన్ని మాత్రమే చూశామని ఇది రైతులకు భారీ నష్టమని పేర్కొన్నారు. ఇదేవిషయమై గ్రామస్థులు మాట్లాడుతూ“కొనుగోలు కేంద్రాలలో కాపలాదారు లేకపోవడం వల్లే ఈ పరిస్థితులు వస్తున్నాయి. రైతులకు రక్షణ ఇవ్వాలంటే అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలి”అని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఎంతో శ్రమించి ధాన్యం కోసమే ఖర్చులు పెట్టి, పండించిన పంటలో ఇంత పెద్ద నష్టం రావడంతో రైతు అనిల్ రెడ్డి తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY