నిరుద్యోగుల ఎదురుచూపులు… ఇంకెన్నాళ్లు!?
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో “మన రాష్ట్రం వస్తే మన ఉద్యోగాలు మనకే” అన్న నమ్మకంతో వేలాది మంది నిరుద్యోగ యువత పోరాటాల్లో పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ అవుతాయని, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశించారు. అయితే రాష్ట్రం ఏర్పడిన తరువాత పరిస్థితులు ఆశించిన విధంగా మారలేదనే అభిప్రాయం యువతలో వ్యక్తమవుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా నిరుద్యోగ శాతం తగ్గకపోగా, పెరుగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో ఆలస్యం జరుగుతుండటం, పదవీ విరమణ వయస్సును 58 నుండి 61 సంవత్సరాలకు పెంచడం వల్ల కొత్త ఉద్యోగాల అవకాశాలు మరింత తగ్గాయని నిరుద్యోగులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు యువతలో అసంతృప్తిని పెంచుతున్నాయి.
ఉద్యోగాల కోసం యువత ఆత్రుత
కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా మరిన్ని ఉద్యోగాలు వస్తాయని ఆశించిన నిరుద్యోగులు, సంవత్సరాలుగా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. అనేక మంది యువత పట్టణాలకు వెళ్లి కోచింగ్ సెంటర్లలో చేరి, హాస్టళ్లలో ఉంటూ వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయితే ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో వారి వ్యక్తిగత జీవితాలపై కూడా ప్రభావం పడుతోంది. వివాహ వయస్సు దాటిపోతున్నా, ఇంకా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
ప్రభుత్వాలపై పెరుగుతున్న నిరాశ
2023లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి. లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీలపై విశ్వాసం ఉంచారు. కానీ గడిచిన కాలంలో కూడా గణనీయమైన నోటిఫికేషన్లు వెలువడకపోవడం, నియామక ప్రక్రియలు వేగవంతం కాకపోవడం యువతలో నిరాశను పెంచుతోంది. ప్రస్తుతం నిరుద్యోగులు “నివురు కప్పిన నిప్పు”లా ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆర్థిక ఇబ్బందుల వాదనపై ప్రశ్నలు
ప్రభుత్వం తరచూ ఆర్థిక ఇబ్బందులను కారణంగా చూపుతున్నప్పటికీ, అదే కారణం ఉద్యోగాల భర్తీకి మాత్రమే వర్తించడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో ఆలస్యం చేయడం ఎంతవరకు సమంజసం అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తక్షణ చర్యల అవసరం
ప్రతి సమాజంలో యువతే శక్తి. వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత. ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని వెంటనే భర్తీ చేయడం ద్వారా మాత్రమే నిరుద్యోగ సమస్యను తగ్గించవచ్చు. పదవీ విరమణ పొందిన ఉద్యోగి స్థానంలో వెంటనే కొత్త నియామకం చేసే విధానాన్ని అమలు చేస్తే యువతకు న్యాయం జరిగే అవకాశం ఉంది. నిరుద్యోగుల్లో అసహనం మరింత పెరగకముందే ప్రభుత్వాలు స్పందించి, ఖాళీ ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం ఉంది. లేదంటే యువతలో పెరుగుతున్న అసంతృప్తి భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. ఈరోజు పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగి స్థానంలో మరుసటి రోజే కొత్త ఉద్యోగిని నియమించే చట్టం తీసుకురావాలి. అలాంటి చట్టాలు వస్తే తప్ప నిరుద్యోగులకు న్యాయం జరగదనేది సత్యం.
రచయిత: కుసుమ సిద్దారెడ్డి – 9989189114

