ఉపాధ్యాయులు, ఉద్యోగులకు దసరా కానుకగా డి.ఏ. ప్రకటించాలి – ఎస్టీయూ
చిలకలూరిపేట:
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు దసరా పండుగ కానుకగా కరువు భత్యం (డి.ఏ.) ప్రకటించాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) డిమాండ్ చేసింది. 2024 జనవరి నుండి పెండింగ్లో ఉన్న నాలుగు డి.ఏ లలో కనీసం రెండు అయినా ప్రకటించాలని ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కే. కోటేశ్వరరావు, రాష్ట్ర డైరీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు కోరారు.
గత ప్రభుత్వం పిఆర్సి, డి.ఏ బకాయిలను పెండింగ్లో ఉంచిందని, వాటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం కృషి చేయాలని తెలిపారు. ఉపాధ్యాయులపై యాప్ల భారం తగ్గించి, అసెస్మెంట్ బుక్ విధానం రద్దు చేయాలని, మున్సిపల్ ఉపాధ్యాయులకు పి.ఎఫ్ ఖాతాలు ప్రారంభించాలని కోరారు.
12వ పి.ఆర్.సి కమిషనర్ నియామకంలో ఆలస్యం జరుగుతున్నందున 30% మధ్యంతర భృతి ప్రకటించాలని, ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. టెట్ పాస్ నిబంధనపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.
మెగా డీఎస్సీ–2025 నియామకాల ముందు క్లస్టర్ ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలని సూచించారు. విద్యా సంవత్సరంలో ఇచ్చిన మూల్యాంకన పుస్తకాలు ఉపాధ్యాయులు, విద్యార్థులకు భారంగా మారాయని, వాటిని పునఃపరిశీలించి రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.
చిలకలూరిపేటలో ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఏరియా కార్యదర్శి వినుకొండ అక్కయ్య అధ్యక్షత వహించారు. పట్టణ అధ్యక్షులు మేకల కోటేశ్వరరావు, వడ్లాన జయప్రకాష్, నాదెండ్ల మండల అధ్యక్షులు షేక్ మక్బూల్ బాషా, చిలకలూరిపేట మండల అధ్యక్షుడు బొంత రవి, ఎడ్లపాడు మండల అధ్యక్షుడు జి. కోటేశ్వరరావు, ఇతర నేతలు చావల మల్లేశ్వరరావు, ఇనకొల్లు అంకమ్మరావు, పి.సాగర్ బాబు, ఎం. చిన్నవెంకటస్వామి, కుంభ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.
