ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ తీగల తొలగింపునకు చర్యలు తీసుకోవాలి…..
పెద్దపల్లి విద్యుత్ శాఖ అధికారి వద్ద వినతి పత్రం అందజేసిన కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్….
సాక్షిత పెద్దపల్ల//జిల్లా ప్రతినిధి:రామగుండం,రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని మొదటి డివిజన్ ఇందిరమ్మ కాలనీలో ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ తీగలను తొలగించాలని కోరుతూ కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్ పెద్దపల్లి విద్యుత్ శాఖ అధికారి (ఎస్ఈ)కి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దాదాపు 20 సంవత్సరాల క్రితం అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో, స్వర్గీయ మాజీ ఎంపీ కాక వెంకటస్వామి ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీ ఏర్పాటు చేయబడిందన్నారు. ఆ సమయంలో విద్యుత్ స్తంభాలను సరైన ప్రణాళిక లేకుండా ఏర్పాటు చేయడంతో అనేక ఇళ్లపై నుంచి విద్యుత్ తీగలు వెళ్లుతున్నాయని తెలిపారు.
వర్షాకాలంలో ఇళ్లకు విద్యుత్ ప్రభావం చేరే ప్రమాదం ఉండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు.
ఇళ్లపైకి వెళ్లాలన్నా ప్రాణాలను పణంగా పెట్టాల్సిన పరిస్థితి నెలకొందని వివరించారు. ఈ సమస్యను విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించి, త్వరలోనే సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ప్రజల భద్రత దృష్ట్యా ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ తీగలను వెంటనే తొలగించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్ కోరారు.
