ఎగ్లాస్పూర్లో ఆర్టీసీ బస్ సర్వీస్ ప్రారంభం….
బస్సు నడిపి ప్రజలను ఆకట్టుకున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: అంతర్గాం మండలం ఎగ్లాస్పూర్ గ్రామ ప్రజల రవాణా సౌకర్యార్థం మంగళవారం కొత్త ఆర్టీసీ బస్ సర్వీస్ను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. గ్రామ ప్రజలకు అందుబాటులో రవాణా సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ సేవపై స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ స్వయంగా ఆర్టీసీ బస్సును నడిపి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రజలతో మమేకమై సాధారణ వ్యక్తిలా వ్యవహరించిన ఎమ్మెల్యేను గ్రామస్థులు అభినందించారు.
అనంతరం ఉపాధి కూలీలు, రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండుతున్న ఎండల్లోనూ కష్టపడి పనిచేస్తున్న కూలీలకు ధైర్యం చెబుతూ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని తెలిపారు. అలాగే రైతు కూలీలకు ఒఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.
గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యం అందుబాటులోకి రావడంతో విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలకు ఈ బస్ సర్వీస్ ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, భారీ సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు

