ఉపాధి కూలీలు, రైతులతో మమేకమై సమస్యలు తెలుసుకున్న ప్రజాప్రతినిధి రాజ్ ఠాకూర్…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: పాలకుర్తి మండలం కుక్కలగూడూరు గ్రామంలో మంగళవారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఉపాధి హామీ కూలీలు, రైతులను కలిసి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. మండుతున్న ఎండలను లెక్కచేయకుండా ట్రాక్టర్ నడుపుకుంటూ నేరుగా కూలీలు పని చేస్తున్న ప్రాంతానికి చేరుకుని వారితో ఆప్యాయంగా మాట్లాడారు.
ఈ సందర్భంగా ఉపాధి కూలీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. రైతులతో వ్యవసాయ పరిస్థితులు, పంటల సాగు, నీటి వసతి తదితర అంశాలపై చర్చించారు.
అనంతరం ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్లు, టోపీలు పంపిణి చేశారు. కూలీల ఆరోగ్యం కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గ్రామానికి వచ్చి తమ సమస్యలు తెలుసుకోవడం పట్ల కూలీలు, రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
ప్రజలతో మమేకమై వారి మధ్యకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సేవాభావాన్ని గ్రామస్తులు అభినందించారు. గ్రామ అభివృద్ధి, రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
