వేణుగాన అలంకారంలో శ్రీరాముడు అభయం
** ఒంటిమిట్టలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
సాక్షిత ప్రతినిధి – తిరుపతి / ఒంటిమిట్ట: టీటీడీకి చెందిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఉదయం వేణుగాన అలంకారంలో స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు.
ఉదయం 7.30 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
ఉదయం 11 గంటలకు ఆలయంలో స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ప్రశాంతి, ఆలయ సూపరింటెండెంట్ హనుమంతయ్య, ఆలయ ఇన్స్పెక్టర్ నవీన్, ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY