సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలకు ఎస్పీ నరసింహ శుభాకాంక్షలు
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ తరపున జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బోగి, సంక్రాంతి, కనుమ పండుగలను కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయబద్ధంగా, శాంతియుతంగా మూడు రోజులపాటు జరుపుకోవాలని ఆయన కోరారు. పండుగ వేళ కోడి పందాలు, జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు పూర్తి నిషేధం ఉందని స్పష్టం చేశారు.
ఈ అంశంపై పోలీసుల కఠిన నిఘా కొనసాగుతుందని, కోడి పందాలు లేదా జూదం నిర్వహించినా, పాల్గొన్నా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, క్రీడా పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించే సమయంలో యువత సంయమనం పాటించి ఎలాంటి గొడవలకు తావివ్వకుండా ఆదర్శంగా నిలవాలని సూచించారు. పండుగ రద్దీని ఆసరాగా చేసుకుని అపరిచితులు అడ్రస్ అడుగుతున్నట్టు నటిస్తూ మెడలోని బంగారు ఆభరణాలు దొంగతనం చేసే అవకాశముందని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు అప్రమత్తంగా ఉండాలని, బయట ముగ్గులు వేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. ప్రజలందరూ సహకరించి పండుగలను సుఖసంతోషాలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ నరసింహ విజ్ఞప్తి చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
