ఆగస్టు 3లోపు సార్ ప్రక్రియ పూర్తి చేయాలి.

Sakshitha news

ఆగస్టు 3లోపు సార్ ప్రక్రియ పూర్తి చేయాలి…

కార్పొరేటర్లు, ఇంచార్జీలకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దిశానిర్దేశం….

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం,
రామగుండం నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సార్ ) ప్రక్రియను గడువులోపు పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ కార్పొరేటర్లు, ఇంచార్జీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్పొరేటర్లు, డివిజన్ ఇంచార్జీలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన సార్ పురోగతిని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, SIR ప్రక్రియ పూర్తి చేసేందుకు కేవలం 15 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందని, ప్రతి ఒక్కరూ దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పని చేయాలని సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైన ప్రతి ఓటరు వివరాలను నమోదు చేయించడం కార్పొరేటర్లు, ఇంచార్జీల బాధ్యత అని స్పష్టం చేశారు.
కొన్ని డివిజన్లలో SIR పురోగతి 40 శాతానికే పరిమితమైందని పేర్కొంటూ, ఆ డివిజన్లలో పనులను వెంటనే వేగవంతం చేయాలని ఆదేశించారు. పనుల పర్యవేక్షణ కోసం సూపర్వైజర్లను నియమించినట్లు తెలిపారు.

ప్రతి ఒక్కరూ బీఎల్ఓలతో సమన్వయం చేసుకుంటూ ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ప్రత్యక్షంగా కలవాలని, అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు నమోదు అయ్యేలా చూడాలని సూచించారు. పదవుల భావనతో కాకుండా ప్రజల కోసం పనిచేసే కార్యకర్తలుగా ప్రతి ఇంటిని సందర్శించి ఒక్క ఓటరు కూడా మిగిలిపోకుండా సార్ ప్రక్రియను పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.

ఆగస్టు 3వ తేదీలోపు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసి రామగుండం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శంగా నిలపాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కార్పొరేటర్లు, ఇంచార్జీలకు సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్, కాంగ్రెస్ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Scroll to Top