ఆదాయం పెంపునకు కొత్త లేఅవుట్స్ ఏర్పాటు

Sakshitha news

ఆదాయం పెంపునకు కొత్త లేఅవుట్స్ ఏర్పాటు

** రాష్ట్ర పురపాలక మంత్రి నారాయణ

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: ప్రజలకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనకు అధికారులు ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేస్తున్నారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. ఆయన “తుడ” కార్యాలయంలో నగరపాలక సంస్థ ,తుడా అధికారులతో అభివృద్ధి పనులు, ప్రజలకు కల్పించాల్సిన వసతులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో తుడా టవర్స్ , ప్లాట్స్ , దుకాణాల పై వచ్చే అదాయ, వ్యయాలపై తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ అండ్ జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, నగరపాలక సంస్థ లో పారిశుద్ధ్యం, సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, కార్మికులకు కల్పించాల్సిన వసతులపై కమిషనర్ నారపురెడ్డి మౌర్య వివరించారు. టౌన్ షిప్ లను అభివృద్ధి చేసి తుడా ఆదాయాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు. తుడా ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కోరారు. నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలన్నారు. పక్కా ప్రణాళికతో ముందుకెళ్లి లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించే నివేదికలను ఇవ్వకుండా వాస్తవాలను వివరించి, ప్రజల సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. నెల్లూరు తరహాలో తిరుపతిలో కూడా రోడ్ల శుభ్రతకు స్వీపింగ్ మిషన్లను వినియోగించాలన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్ పర్సన్ సుగుణమ్మ, డిప్యూటీ మేయర్ ఆర్.సి.మునికృష్ణ, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, తుడా సెక్రటరీ డాక్టర్ శ్రీకాంత్, సూపరింటెండెంట్ ఇంజినీర్లు కృష్ణా రెడ్డి, శ్యాంసుందర్, ఈ.ఈ.లు రవీంద్ర, తులసి కుమార్, గోమతి, తేజస్విని, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.