గోదావరిఖనిలో వరుస రోడ్డు ప్రమాదాలు….
–ట్రాఫిక్ నియంత్రణలో లోపాలపై బీజేపీ నేతల ఆందోళన…
-సోమారపు లావణ్య….
సాక్షిత పెద్దపల్లి// గోదావరిఖని:
గోదావరిఖని ప్రాంతంలో నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ ట్రాఫిక్ పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవల ప్రగతినగర్కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఘటనపై బీజేపీ నాయకురాలు సోమారపు లావణ్య స్పందించారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న ఆమె, అనంతరం ప్రమాదం జరిగిన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆర్ఎఫ్సీఎల్ రోడ్ – ప్రగతినగర్ మార్గంలో వేగ నియంత్రణ లేకపోవడం, సరైన ట్రాఫిక్ సైన్ బోర్డులు లేకపోవడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని అన్నారు. మద్యం, గంజాయి మత్తులో వాహనాలు నడపడం వల్ల అమాయక ప్రజలు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో 10కి పైగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని పేర్కొంటూ, తక్షణమే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ సైన్ బోర్డులు ఏర్పాటు చేసి, ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణను పెంచాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కాలనీ వాసులతో కలిసి ఆమె సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, భాస్కర్, రజిత, లక్ష్మి, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY