భగవద్గీత పోటీలో రిశ్విక్ కు ద్వితీయ స్థానం…
–అభినందించి, బహుమతి అందించిన ఇస్కాన్ ప్రతినిధులు..
సాక్షిత పెద్దపల్లి//గోదావరిఖని: అంతర్జాతీయ సంస్థ ఇస్కాన్ ఇటీవల నిర్వహించిన ప్రపంచ స్థాయి ‘భగవద్గీత వాల్యూ ఎడ్యుకేషన్ కాంటెస్ట్’లో కృష్ణవేణి స్కూల్ విద్యార్థి రాకం రిశ్విక్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానాన్ని సాధించి ప్రశంసలందుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.. గత ఫిబ్రవరి 3న. ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్లైన్ ‘భగవద్గీత వాల్యూ ఎడ్యుకేషన్’ పోటీలో జిల్లా వ్యాప్తంగా వందలాది మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనగా, ఈ పరీక్షలో 95 శాతం కంటే అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు జూమ్ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహించి జిల్లా స్థాయి ప్రతిభావంతులను ఎంపిక చేశారు.
ఈ నేపథ్యంలో గోదావరిఖని తిలక్ నగర్కు చెందిన రాకం కిరణ్-శ్వేత దంపతుల కుమారుడు, కృష్ణవేణి స్కూల్స్లో 8వ. తరగతి చదువుతున్న రాకం రిశ్విక్ జిల్లా స్థాయి సెకండ్ టాపర్గా నిలిచి తన ప్రతిభను చాటాడు. ఈ విజయాన్ని పురస్కరించుకుని ఇస్కాన్ సంస్థ ప్రతినిధి ప్రేమ్ రాజ్ చైతన్య, రిశ్విక్కు బహుమతిగా సైకిల్తో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందించారు.
భగవద్గీత, భారతీయ సంస్కృతి గొప్ప తనాన్ని భావి తరాలకు తెలిపేందుకు తాము నిర్వహిస్తున్న ఈ పోటీలో రిశ్విక్ అసమాన ప్రతిభ కనబరచడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ… పోటీలో ప్రతిభ కనబరిచి తల్లిదండ్రులకు, పాఠశాలకు, గోదావరిఖనికి మంచి పేరు తీసుకొచ్చిన రిశ్విక్ను అభినందించారు.
విద్యార్థి విజయానికి తోడ్పడిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్ కు కృతజ్ఞతలు తెలిపారు. రిశ్విక్ సాధించిన ఈ విజయం ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఇంకా ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ మంజులా శ్రీనివాస్ రెడ్డి, అకాడమిక్ ప్రిన్సిపాల్ రామకృష్ణ, క్యాంపస్ ప్రిన్సిపాల్, రిష్విక్ నాన్న కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY