సురక్షిత డ్రైవింగ్ అలవాట్లు అలవరచుకోవాలి…
“అరైవ్ – అలైవ్ ” ఫేజ్–3లో భాగంగా రామగుండం రైల్వే స్టేషన్ వద్ద ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం…
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత – డీసీపీ బి. రామ్ రెడ్డి..
సాక్షిత పెద్దపల్లి//రామగుండం: రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహిస్తున్న “అరైవ్ – అలైవ్” మూడో దశ కార్యక్రమంలో భాగంగా, రామగుండం పోలీస్ ఆధ్వర్యంలో రామగుండం రైల్వే స్టేషన్ వద్ద ఈరోజు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి డీసీపీ పెద్దపల్లి బి. రామ్ రెడ్డి , గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ , రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ హాజరై ఆటో డ్రైవర్లను ఉద్దేశించి ప్రసంగించారు.
డీసీపీ మాట్లాడుతూ, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, అధిక ప్రయాణికులను ఎక్కించకూడదని, వేగ పరిమితులను పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
ద్విచక్ర వాహనాలు నడిపినప్పుడు హెల్మెట్ ఫోర్ వీల్స్ నడిపినప్పుడు సీట్బెల్ట్ వినియోగం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, పాదచారులకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల వల్ల కలిగే నష్టాలను వివరించి, సురక్షిత డ్రైవింగ్ అలవాట్లు అలవరచుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్, రామగుండం ఎస్సై సంధ్యారాణి, పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY