ఒంటిమిట్ట ఆలయానికి పవిత్ర విష్ణుదర్భ
సాక్షిత ప్రతినిధి – తిరుపతి / ఒంటిమిట్ట: కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో (శుక్రవారం) రేపు నిర్వహించనున్న ధ్వజారోహణ కార్యక్రమానికి ఉపయోగించే పవిత్ర విష్ణు దర్భతో తయారు చేసిన దర్భ మత్తు, తాడును బుధవారం ఘనంగా ఆలయ అధికారులకు సమర్పించారు. టీటీడీ అటవీశాఖ అధికారులు ఈ పవిత్ర దర్భను ఆలయ అధికారులకు అందజేశారు.
విష్ణు దర్భ ప్రాధాన్యం
టీటీడీ అటవీశాఖ సిబ్బంది ప్రత్యేకంగా తయారు చేసిన సుమారు 22 అడుగుల పొడవు, 7.5 అడుగుల వెడల్పు కలిగిన దర్భ మత్తు (సుమారు 60 కిలోల బరువు)తో పాటు 225 మీటర్ల పొడవు గల దర్భ తాడును ప్రతి సంవత్సరం ధ్వజారోహణ కార్యక్రమంలో వినియోగిస్తారు. ఈ పవిత్ర విష్ణు దర్భను శుద్ధి చేసి ఎండబెట్టి ధ్వజస్తంభానికి చుట్టుతారు. ఈ తాడుతో గరుడ పతాకాన్ని ఎగురవేయడం ద్వారా శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల ప్రారంభాన్ని సూచిస్తారు. ఈ పవిత్ర గడ్డి శుద్ధి లక్షణాలతో పాటు సూక్ష్మజీవులను నిరోధించే గుణాలు కలిగి ఉందని విశ్వసిస్తారు.
తయారీ విధానం
టీటీడీ అటవీశాఖ సిబ్బంది ఏర్పేడు సమీపంలోని చెల్లూరు గ్రామ పరిసర ప్రాంతాల నుండి ఈ దర్భను సేకరిస్తారు. అనంతరం ఒక వారం రోజుల పాటు ఎండబెట్టి, సుమారు నెలరోజుల పాటు భక్తి శ్రద్ధలతో దర్భ మత్తు, తాడును తయారు చేస్తారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఇన్చార్జ్ డీఎఫ్ఓ డా. ఏ.వి.ఎన్. శివకుమార్, డీఎఫ్ఓ విజయ్కుమార్, డిప్యూటీ ఈవో ఎ. ప్రశాంతి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY