ఆయిల్పామ్ తోటలు నాటుకోండి…. నెల నెలా జీతం లాగా ఆదాయం పొందండి…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: రైతులు సాంప్రదాయ పంటలతో పాటు దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయాన్ని అందించే ఆయిల్పామ్ సాగును విస్తృతంగా చేపట్టాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్ సూచించారు. ఆయిల్పామ్ ఒక వాణిజ్య పంటగా రైతులకు దీర్ఘకాలం పాటు నెల నెలా జీతం మాదిరిగా ఆదాయాన్ని అందించే ప్రత్యేకత కలిగి ఉందని ఆయన తెలిపారు.
ఆయిల్పామ్ తోటలను ఏర్పాటు చేసిన అనంతరం సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే నాలుగో సంవత్సరం నుంచి దిగుబడి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అనంతరం ప్రతి నెలా తాజా పండ్ల గుత్తులు (FFBs) కోతకు రావడం వల్ల రైతులకు నిరంతర ఆదాయం లభిస్తుందని వివరించారు. మార్కెట్లో ధరల హెచ్చుతగ్గుల ప్రభావం తక్కువగా ఉండటంతో పాటు ప్రభుత్వం, ఆయిల్పామ్ కంపెనీల సహకారంతో పంటకు భరోసా ఉంటుందని తెలిపారు.
ఇటీవల నిర్వహించిన ఆయిల్పామ్ శిక్షణ కార్యక్రమాల్లో రైతులకు మొక్కల నాటకం, ఎరువుల యాజమాన్యం, నీటి నిర్వహణ, పురుగులు, వ్యాధుల నివారణ, కోత అనంతర నిర్వహణ వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించినట్లు చెప్పారు. రైతులు శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని సూచించారు.
అలాగే కూరగాయల సాగు, పంటల వైవిధ్యీకరణ (క్రాప్ డైవర్సిఫికేషన్) ద్వారా అదనపు ఆదాయ వనరులను పెంచుకునే అవకాశాలపై కూడా రైతులకు సూచనలు అందించినట్లు తెలిపారు.
రైతులు ఆయిల్పామ్ సాగును స్వీకరించి దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయాన్ని పొందడంతో పాటు తమ ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేసుకోవాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
