30 ఏళ్లు ముందుకు కాదు.. నేరుగా రాతియుగానికే : ప్రత్తిపాటి
సాక్షిత : 5 కోట్ల ప్రజల్ని ఐదేళ్లలో మరణం అంచులవరకు తీసుకెళ్లిన అసుర పాలన జగన్ ది : ప్రత్తిపాటి.
మరోసారి అధికారమిస్తే 30 ఏళ్లు ముందుకు కాదు.. నేరుగా రాతియుగానికేనని ప్రజల మనోగతం : ప్రత్తిపాటి.
“ జగన్ మళ్లీ వస్తే ఆన్న అలోచన సజ్జలకు చెప్పడానికి ఇంపుగా ఉన్నా.. రాష్ట్ర ప్రజలకు మాత్రం వెన్నులో నుంచి జలదరింపు, దేశానికి యావగింపుగా ఉంది. అసలు ఆ ఊహే రాష్ట్రప్రజలతో పాటు భారతీయులకే భయంకరంగా ఉంది. కారణం జాతీయ, అంతర్జాతీయ స్థాయికి పాకిన జగన్ నేరచరిత్రే.. ఆర్ధిక విధ్వంసమే.
అధికారంలో ఉన్నప్పుడు అనుకూలంగా సన్నాయినొక్కులు నొక్కిన సజ్జల…. ఇప్పుడేమో దింపుడు కళ్లం గిమ్మిక్కులు ప్లే చేస్తున్నాడు. 5 ఏళ్లలో 15-20 ఏళ్ల అభివృద్ధి జరిగిందని చెబుతున్న అది ఎక్కడుందో, ఎలా ఉందో ప్రజలకు చెప్పాలి. ఆ అభివృద్ధి వైసీపీశ్రేణులకు.. తనకు.. తనకుటుంబానికా అనేది కూడా స్పష్టత ఇవ్వాలి. మరోసారి అధికారమిస్తే 30 ఏళ్లు ముందుకు కాదు.. నేరుగా రాతియుగానికేనని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ వాస్తవం సజ్జలకు, వైసీపీనేతలకు ఇంకా అర్థం కాకపోవడం బాధాకరం.
ప్రజలపై పన్నుల భారం.. అవినీతి, దోపిడీల స్వైరవిహారం
5 కోట్ల ప్రజల్ని ఐదేళ్లలో మరణం అంచులవరకు తీసుకెళ్లిన అసుర పాలన జగన్ ది. ఒక్క ఛాన్స్ కే అమరావతి అడవిగా మారితే, పోలవరం గోదారి పాలైంది. సంక్షేమం, అభివృద్ధి నేతిబీరలో నెయ్యి చందంగా మారాయి. ప్రజలపై పన్నుల భారం… అవినీతి..దోపిడీల స్వైరవిహారమే మిగిలింది. అత్యాచారాలు.. రైతుఆత్మహత్యల్లో ఏపీది అగ్రస్థానం.. పారిశ్రామిక ప్రగతిలో ప్రజలకు మిగిలింది భరించలేని అవమానభారం. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల ప్రగతి సున్నా.. రాష్ట్రం ఇమేజ్ డ్యామేజ్ లో మాత్రం దేశానికే మిన్నగా నిలిచిన దౌర్భాగ్యపు పాలన జగన్ ది.
హానికారక మద్యం, గంజాయి..మాదకద్రవ్యాలు అంగడి సరుకుగా మారి… ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తుంటే..జగన్ ఖజానా నిండగా….వైసీపీనేతలకు నిత్యం పండుగ. ప్రభుత్వ.. ప్రైవేట్ భూములు, ఇసుక, గ్రావెల్, క్వార్జ్, సహా రాష్ట్ర ఖనిజసంపద లూఠీ… ప్రజల్ని చేశారు, అప్పులు, వడ్డీల చెల్లింపులో మేటిగా నిలిపారు జగన్ అండ్ కో.” అని మాజీమంత్రి ప్రత్తిపాటి ఒక ప్రకటనలో తెలిపారు.

