తెలంగాణలో కొత్త పోలీసింగ్ విధానం.. డీజీపీ శివధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో కొత్త పోలీసింగ్ విధానానికి రూపకల్పన చేస్తున్నామని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో న్యూ పోలీసింగ్ విధానం తీసుకువస్తామని.. ఇదీ తన లైన్ అని పేర్కొన్నారు. ఫెయిర్, ఫర్మ్, ఫ్రెండ్లీ, ప్రొఫెషనల్ పోలీసింగ్ చేపడతామని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో డీజీపీ శివధర్ రెడ్డి ప్రత్యేకంగా ఇవాళ(శుక్రవారం) సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పోలీసులందరికీ దిశా నిర్దేశం చేశారు డీజీపీ శివధర్ రెడ్డి.
నిష్పక్షపాత పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. నిర్భయంగా విధులు నిర్వహించడమే పోలీసుల లక్ష్యం కావాలని సూచించారు. బెదిరింపులు, ఒత్తిళ్లు, భయాలకు తలొగ్గకుండా రూల్ ఆఫ్ లా అమలు చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే ఊరుకోబోనని హెచ్చరించారు డీజీపీ శివధర్ రెడ్డి.
పోలీస్ స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని చెప్పుకొచ్చారు. కేసు నమోదు నుంచి నేరస్థుడికి శిక్ష పడే దాకా పోలీసులు ప్రొఫెషనల్గా వ్యవహారించాలని ఆదేశించారు. డ్రగ్స్, గంజాయి విషయంలో కఠినంగా ఉండాలని హుకుం జారీ చేశారు. రాష్ట్రంలో ప్రతి ఏడాది 800 హత్యలు జరిగితే.. రోడ్డు ప్రమాదాల్లో 8 వేలమంది చనిపోతున్నారని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
