సమస్యల పరిష్కారమే నా అజెండా

Sakshitha news

సమస్యల పరిష్కారమే నా అజెండా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్పష్టం

సాక్షిత ప్రతినిధి – చంద్రగిరి: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేయడమే తన అజెండాగా పాలన సాగిస్తున్నట్లు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్పష్టం చేశారు. చంద్రగిరి మండలం కల్ రోడ్ పల్లి పంచాయతీలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముందుగా కల్ రోడ్ పల్లి పంచాయతీకి విచ్చేసిన ఎమ్మెల్యేకి మహిళలు కర్పూర హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అధికారులు స్వాగతం పలికి సత్కరించారు. ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం తమదే అన్నారు.

గత సంవత్సర పాలనలో చంద్రగిరి మండలంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకుని పరిష్కారం చేశారు. అయితే 2019 నుంచి గడిచిన 5 సంవత్సరాలలో కల్ రోడ్ పల్లి పంచాయతీ అభివృద్ధికి నోచుకోలేదని, అందుకు జగన్ రెడ్డి అనుచరుడైన చెవిరెడ్డి నిర్లక్ష్యం కారణమన్నారు. కల్ రోడ్ పల్లి పంచాయతీలో సుమారు 26 అభివృద్ధి పనులకు 3కోట్ల 24 లక్షల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు.
గతంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఇచ్చిన అర్జీలు 80 శాతం వరకు పరిష్కారం అయ్యాయని ఎమ్మెల్యే వెల్లడించారు. కొన్ని అర్జీలు కోర్టు, ఇతర పరిధిలో ఉండడం వల్ల పరిష్కారం చూపలేదని ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు. అయినప్పటికీ పంచాయతీలోని సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చి భరోసా చేశారు.
చంద్రగిరి మండలాన్ని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు.