ఉదయపూర్ పర్యాటక ప్రాంతాలను సందర్శించిన మంత్రి కందుల దుర్గేష్
సాక్షిత : కృత్రిమ మంచినీటి సరస్సు లేక్ పిచోలా, ఉదయపూర్ మాన్సూన్ ప్యాలెస్ సందర్శన
ఆయా పర్యాటక ప్రాంతాల విశిష్టతను మంత్రి దుర్గేష్ కి తెలిపిన స్థానిక అధికారులు, గైడ్స్
సరస్సుల నగరం ఉదయపూర్ అద్భుతంగా ఉందని ప్రశంసించిన మంత్రి దుర్గేష్.. ఇక్కడ పర్యాటక ప్రాంతాల్లో అవలంబిస్తున్న విధానాలు ఏపీలో అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేసిన మంత్రి దుర్గేష్
ఉదయ్ పూర్ : అక్టోబర్ 14,15 తేదీల్లో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన కాన్ఫరెన్స్ కు హాజరై, సమావేశం ముగిసిన అనంతరం ఉదయపూర్ లోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలను మంత్రి కందుల దుర్గేష్ సందర్శించారు. ఈ సందర్భంగా బోట్ లో వెళ్లి కృత్రిమ మంచినీటి సరస్సు లేక్ పిచోలా ను సందర్శించారు. అక్కడే ఉన్న జగ్ నివాస్, జగ్ మందిర్ లను దర్శించారు. అక్కడి కోట చారిత్రక వైభవాన్ని స్థానిక గైడ్స్ ద్వారా తెలుసుకున్నారు. అనంతరం ఉదయపూర్ మాన్సూన్ ప్యాలెస్ ను సందర్శించి కలియ తిరిగారు. అక్కడ చారిత్రక విశేషాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ భారతదేశంలోని అత్యంత అందమైన నగరాల్లో సరస్సుల నగరంగా పేరుగాంచిన ఉదయపూర్ ఒకటని కొనియాడారు. పెద్ద రాజభవనాలు, ప్రశాంతమైన సరస్సులు, చారిత్రక కోటలు ఇక్కడి వైభవాన్ని ప్రతిబింబిస్తున్నాయన్నారు. ఈ పర్యాటక పర్యటన అనంతరం ఆంధ్ర ప్రదేశ్ లోని పర్యాటక ప్రాంతాల్లో ఇక్కడ అవలంబిస్తున్న విధానాలు అమలు చేస్తే బాగుంటుందనిపించింది అన్నారు.
జారీ చేసిన వారు: పిఆర్ఓ, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి
