- మణుగూరు టు బయ్యారం రోడ్డు పునర్మించాలి
— గుంతల మయంగా మణుగూరు టు బయ్యారం క్రాస్ రోడ్డు రహదారి
— ప్రయాణికుల అవసరాలు దృష్టి కొత్త రహదారి నిర్మించాలి-
–ప్రత్యేకంగా రాబోయే రోజుల్లో మేడారం జాతర మరియు గొదావరి పుష్కరాలు దృష్టిలో ఉంచుకుని తక్షణమే పునర్నిర్మించి, సరైన వెడల్పు చేయాలి..
— కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించిన మాజీ జెడ్పిటిసి పాల్వంచ దుర్గ
మణుగూరు నుండి బిటిపిఎస్ బయ్యారం ఎక్స్ రోడ్డు వరకు కొత్త బీటీ రోడ్ తక్షణమే నిర్మించాలనీ, మణుగూరు మాజీ జెడ్పిటిసి పాల్వంచ దుర్గ కలెక్టరేట్లో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మణుగూరు సురక్షా బస్టాండ్ నుండి బిటిపిఎస్, బయ్యారం ఎక్స్ రోడ్డు వరకు ఉన్న రహదారి అత్యంత దారుణ స్థితిలో ఉందని, వెంటనే కొత్త బ్లాక్ టాప్ (BT) రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
ఈ రహదారి పినపాక, కరకగూడెం, గుండాల, తాడ్వాయి, ములుగు, ఏటూరునాగారం వంటి ప్రాంతాలకు వెళ్ళే ప్రజలకు ప్రాణాధారంగా ఉన్నప్పటికీ, భారీ గుంతలు, వర్షపు నీటితో మునిగిపోవడం, డ్రైనేజీ లేకపోవడం వలన తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రాణనష్టం కూడా జరుగుతుందని వివరించారు.
అత్యవసర వాహనాలు, అంబులెన్సులు, విద్యార్థులు, వృద్ధులు, మహిళలు, రైతులు, కూలీలు, పండుగ సందర్భాల్లో యాత్రికులు ఈ రహదారిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారని, కానీ దయనీయమైన పరిస్థితుల వల్ల ప్రతిరోజూ ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రత్యేకంగా రాబోయే రోజుల్లో మేడారం జాతర మరియు గోదావరి పుష్కరాలు దృష్ట్యా, ఈ రహదారి తక్షణమే పునర్నిర్మించి, సరైన వెడల్పు, డ్రైనేజీ సదుపాయాలతో, శాశ్వత ప్రణాళికలో పూర్తి చేయాలని, ప్రమాద ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, రక్షణ ఏర్పాట్లు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.ఇది కేవలం రహదారి సమస్య కాదు, గ్రామీణ మరియు గిరిజన ప్రజల జీవన ప్రమాణాలు, భద్రత, గౌరవం గురించి. మణుగూరు ప్రజలు ఎన్నేళ్లుగానో ఎదురుచూస్తున్నారన్నారు . ఈసారి అయినా ప్రభుత్వము ప్రజల రోడ్డు భద్రత అవసరాలను నెరవేర్చాలనీ పాల్వంచ దుర్గ పేర్కొన్నారు.
