ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభల్లో ప్రతిభ చాటనున్న మేజిక్ రాజా….
కవితా పఠనం, ఇంద్రజాలం, మిమిక్రీ, వెంట్రిలాక్విజం ప్రదర్శనలకు ప్రత్యేక ఆహ్వానం….
ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలకు ‘మేజిక్ రాజా’కు ప్రత్యేక ఆహ్వానం….
….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: గోదావరిఖని, స్థానిక ప్రముఖ ఇంద్రజాలికుడు, కవి, కళాకారుడు, వ్యాఖ్యాత, వెంట్రిలాక్విస్ట్, బహుముఖ ప్రజ్ఞాశాలి మేజిక్ రాజాకు 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభల నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది.
చైతన్య సారస్వత పరిషత్ సౌజన్యంతో అంతర్జాతీయ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమహేంద్రవరంలో జూన్ 6, 7 తేదీలలో ఈ మహాసభలు ఘనంగా నిర్వహించనున్నారు.
తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, సాంప్రదాయాలు, కళలను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పే అక్షర మహోత్సవంగా ఈ సభలు రూపుదిద్దుకుంటున్నాయని నిర్వాహకులు తెలిపారు. దేశ, విదేశాల నుంచి సాహిత్య, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు, భాషాభిమానులు ఈ మహాసభల్లో పాల్గొననున్నారని పేర్కొన్నారు. తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచే మహోత్సవంగా ఈ కార్యక్రమం అవతరించనుందని తెలిపారు.
రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ వేదికగా అత్యంత వైభవంగా జరగనున్న ఈ మహాసభల్లో కవితా పఠనం, ఇంద్రజాలం, మిమిక్రీ, వెంట్రిలాక్విజం ప్రదర్శనల విభాగాల్లో పాల్గొనాలని నిర్వాహకులు ఆహ్వానించారు.
ఈ మేరకు శ్రీ శ్రీ కళావేదిక జాతీయ అధ్యక్షురాలు జి. ఈశ్వరీ భూషణం, జాతీయ ప్రణాళికా అధికారి డా. టి. పార్థసారథి మేజిక్ రాజాకు డిజిటల్ ఆహ్వాన పత్రికను పంపించారు.
ఈ ఆహ్వానం అందుకోవడం పట్ల మేజిక్ రాజా హర్షం వ్యక్తం చేస్తూ, తెలుగు భాషా వైభవాన్ని, కళాసంపదను ప్రతిబింబించే ఈ మహాసభల్లో పాల్గొనడం గర్వకారణమని తెలిపారు.
