అవినీతిలో కింగ్ జగన్మోహన్ రెడ్డి
** 11 సీట్లకు పరిమితం చేసినా జగన్ కు బుద్ధి రాలేదు
** తుడ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి
తిరుపతి: రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలనను ఛీత్కరించుకుని 151 ఎమ్మెల్యే సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేసినా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాలేదని, జగన్మోహన్ రెడ్డి తన వ్యవహార శైలిని మార్చుకోకపోతే ప్రజల ఓట్లు కాదు కదా…. కనీసం రోడ్లమీద కూడా తిరగనివ్వరని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడ)
చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి హెచ్చరించారు. తన స్వగృహంలో తుడ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. అవినీతి పరులను, దొంగలను, సంస్కారం లేని వ్యక్తులను వెనకేసుకొచ్చే జగన్మోహన్ రెడ్డికి ముఖ్యంత్రి చంద్రబాబును, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదన్నారు. ఒక మహిళా శాసనసభ్యురాలని అసభ్యకరంగా మాట్లాడి, వ్యక్తిగతంగా దూషించిన ప్రసన్నకుమార్ రెడ్డిని, ఒక తల్లిని అనరాని మాటలను అని వ్యక్తిగత దూషణలు చేసిన వల్లభనేని వంశీలను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి రావడం విడ్డూరంగా ఉందన్నారు. వాళ్ళు ఏమన్నా గాంధీలు, నెహ్రూలా అని ఏద్దేవా చేశారు. తన కారు కింద పడి మృతి చెందిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించలేని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన గంజాయి ముఠా నాయకులను, రౌడీ షీటర్లను, మదమెక్కి స్త్రీలను అగౌరవంగా మాట్లాడుతున్న సంస్కారం లేని నాయకులను పరామర్శించడం ఏంటని ప్రశ్నించారు. టీ దుకాణాలు మొదలు మల్టీ నేషనల్ కంపెనీల నుంచి వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు కలెక్షన్లు వసూలు చేశారని…. ఇవ్వని కంపెనీలను బెదిరించి రాష్ట్రం వదిలి వెళ్ళే విధంగా చేశారని వారి అవినీతిలో జగన్మోహన్ రెడ్డికి కూడా వాటా వెళ్లిందని ఆరోపించారు.
2019 నుంచి 2024 వరకు ప్యాలెస్ లో కూర్చొని పరిపాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకుని దాచుకున్నారని… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ నాయకులకు కూడా తన వ్యవహార శైలిని మార్చుకోకుండా తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఎవరిని వదలం, కేసులు పెడతామంటూ బెదిరించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని వారికి ఓట్లు వేసే పరిస్థితి ఉండకపోగా రోడ్ల పైన కూడా తిరగనివ్వరని హెచ్చరించారు. దేశంలోని అతిపెద్ద కుంభకోణాలలో ఒకటైన రాష్ట్రంలో జరిగిన లిక్కర్ స్కాం కుంభకోణంలో ప్రజాధనాన్ని వాటాలు వేసుకొని వైసిపి నాయకులు పంచుకున్నారని విమర్శించారు. ప్రతినెలా 500 కోట్లు దోచేశారన్నారు. ఈ లిక్కర్ స్కామ్ లో చంద్రగిరి మాజీ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పక్కా ఆధారాలతోనే అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. ఆయన పీఏ లు, గన్ మ్యాన్ లు ఎక్కడెక్కడ డబ్బులు తీసుకొచ్చారు… ఎక్కడ దాచిపెట్టారు… ఎవరెవరికి ఇచ్చారు… వారి వాహనాలు ఎక్కడ తిరిగాయి… శాటిలైట్ ఆధారాలు సైతం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువ నాయకులు మంత్రి లోకేష్ లు అహర్నిశలు ప్రజా సంక్షేమాన్ని రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటూ దేశ విదేశాలు తిరుగుతూ పెట్టుబడులను తీసుకువస్తున్నారని కొనియాడారు. 2014లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేణిగుంట సమీపంలో తీసుకువచ్చిన అనేక కంపెనీలు నేటికీ వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్నాయని గుర్తు చేశారు. భారతదేశంలో నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సేవలను అందిస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో మహిళలు, పౌరులు వ్యాపారవేత్తలు అన్ని వర్గాల ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని అయితే జగన్మోహన్ రెడ్డి తన ఉనికి కోసం పరామర్శల పేరుతో తిరుగుతూ రాష్ట్రంలో అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి ఇలానే వ్యవహరిస్తే ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
