రైతుల ధాన్యానికి న్యాయం జరగాలి.. వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి..

Sakshitha news

రైతుల ధాన్యానికి న్యాయం జరగాలి.. వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి…

— ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్…

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం,
రైతులు పండించిన వడ్లను ఎలాంటి కోతలు లేకుండా వెంటనే కొనుగోలు చేసి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అధికారులను ఆదేశించారు.

రామగుండం నియోజకవర్గ పరిధిలోని బసంత్‌నగర్ గణపతి రైస్ మిల్లును సందర్శించిన ఎమ్మెల్యే అక్కడ నిల్వ ఉంచిన రైతుల వడ్ల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లు యజమానితో మాట్లాడి రైతులు ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా త్వరితగతిన కొనుగోలు చేయాలని సూచించారు.
వడ్ల కొనుగోలులో ఎలాంటి కోతలు విధించకుండా రైతులకు పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

కొనుగోలు ప్రక్రియలో జాప్యం జరిగితే రైతులు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు, మిల్లర్లు పరస్పర సమన్వయంతో పనిచేసి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అవసరమైన అన్ని చర్యలు తీసుకొని రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హామీ ఇచ్చారు.

Scroll to Top