రైతులకు న్యాయం జరగాలి.. ధాన్యం కొనుగోళ్లలో కటింగ్ అస్సలు వద్దు : కలెక్టర్ కోయ శ్రీహర్ష
సాక్షిత పెద్దపల్లి//జిల్లాప్రతినిధి:
జిల్లాలో రైతుల ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి కటింగ్ జరగొద్దని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో వరి ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే సమయంలో ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ఎవరైనా మిల్లర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నాణ్యత పరిశీలించిన ధాన్యాన్ని మాత్రమే రైస్ మిల్లులకు తరలించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ కటింగ్ పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని అధికారులకు స్పష్టం చేశారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన 100 శాతం ట్యాబ్ ఎంట్రీలను పూర్తి చేయాలని ఆదేశించారు.
జూన్ 2 నాటికి జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసి కేంద్రాలను మూసివేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో డీఆర్డీవో కలిందిని, డీసీవో శ్రీమాల, ఏపీఎంలు, ఏపీవోలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
