ఇందిరమ్మ చీరను కట్టుకోవ‌డం గౌర‌వంగా భావిస్తా

Sakshitha news

ఇందిరమ్మ చీరను కట్టుకోవ‌డం గౌర‌వంగా భావిస్తా

ఆడ‌బిడ్డ‌ల‌కు నాణ్య‌మైన సారీలు అంద‌జేస్తున్నం

ఇందిర‌మ్మ చీర‌ల పంపిణీపై రాష్ట్ర మంత్రి శ్రీమ‌తి కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు

హైద‌రాబాద్ః

రాష్ట్రంలో ఆడ‌బిడ్డ‌లంద‌రికీ అందిస్తున్న నాణ్య‌మైన ఇందిర‌మ్మ చీర‌ను తాను కూడా క‌ట్టుకుంటాన‌ని… పేద మ‌హిళ‌ల కోసం ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొస్తున్న ప‌థ‌కంలో భాగంగా పంపిణీ చేస్తున్న ఇందిర‌మ్మ చీర‌ను క‌ట్టుకోవ‌డం తాను గౌర‌వంగా భావిస్తాన‌ని తెలంగాణ అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమ‌తి కొండా సురేఖ కీల‌క వ్యాఖ్యలు చేశారు. బుధ‌వారం ఇందిరాగాంధీ జయంతి పురస్కరించుకొని రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రి సురేఖ హాజ‌రయ్యారు. అనంత‌రం అక్క‌డే ఆమె మీడియాతో మాట్లాడుతూ… మహిళల గౌరవాన్ని పెంపొందించేందుకు నాణ్యమైన చీరలు అందించాలన్న సంకల్పంతోనే పంపిణీ కొంత ఆలస్యం జ‌రిగింద‌ని వివ‌రించారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో నాణ్య‌త లేని చీర‌లు పంపిణీ చేసి… చీర‌ల పంపిణీ ప్ర‌క్రియ‌ను మొత్తం అభాసుపాలు చేశార‌న్నారు.

అయితే, త‌మ ప్ర‌భుత్వం మాత్రం ఉక్కు మ‌హిళ‌, మాజీ ప్ర‌ధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇందిరమ్మ చీరల పంపిణీ పథకాన్ని ప్రారంభించామ‌ని వ్యాఖ్యానించారు. నాణ్య‌మైన చీర‌లు అందించే ఈ పథకాన్ని రెండు విడతలుగా అమలు చేస్తున్నామ‌న్నారు. మొదటి విడతలో భాగంగా నేటి నుంచి తెలంగాణ తల్లి ఆవిష్కరణ దినోత్సవమైన డిసెంబర్ 9 వరకు గ్రామీణ మహిళలకు చీరల పంపిణీని పూర్తి చేస్తామ‌న్నారు. రెండో విడతలో భాగంగా మార్చి 1, 2026 నుంచి పట్టణ ప్రాంత మహిళలకు చీరల పంపిణీ చేపడతామమ‌న్నారు. మొదటి విడతలో 65 లక్షల చీరలు, రెండో విడతలో 35 లక్షల చీరలు పంపిణీ చేస్తామ‌న్నారు. మొత్తంగా కోటికి పైగా నాణ్యమైన చీరలను కోటి మంది మహిళలకు అంద‌జేయాల‌న్న సంకల్పంతో ముందుకు వెళ‌తామ‌న్నారు. అర్హులైన ప్రతి మహిళకు నాణ్యమైన చీర అందించాలన్నదే తమ ప్రజా ప్రభుత్వ ధ్యేయ‌మ‌ని చెప్పారు. ఇందిర‌మ్మ చీరలను పూర్తిగా సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేస్తున్నారని, ఉత్పత్తి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో రెండు విడతల్లో పంపిణీ చేప‌డుతామ‌న్నారు. చీరల నాణ్యత విషయంలో రాజీ పడటం లేద‌ని మంత్రి సురేఖ పున‌రుద్ఘాటించారు.

Scroll to Top