విద్యార్థుల ఆరోగ్యం, అభివృద్ధికి అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలి….
గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: ధర్మారం,
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంతో పాటు వారి సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
ధర్మారం మండలంలోని నంది మేడారం గ్రామంలో ఉన్న టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్/జూనియర్ కాలేజీ (బాలికలు) పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారికి అందిస్తున్న ఆహార నాణ్యత, వసతులు, విద్యా వాతావరణాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు అందించే ఆహార పదార్థాల నాణ్యతను అత్యుత్తమ ప్రమాణాలతో నిర్వహించాలని సూచించారు. పాఠశాల ప్రాంగణాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విద్యార్థుల ఆరోగ్యం, చదువులు, క్రీడలు మరియు ఇతర సహపాఠ్య కార్యక్రమాల్లో వారి పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
వంటశాల పరిసరాలను పరిశుభ్రంగా నిర్వహించి, ఆహార పదార్థాలను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం భద్రపరచాలని సూచించారు. వంట ప్రక్రియలో పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తూ విద్యార్థులకు రుచికరమైన, పోషక విలువలు కలిగిన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
అనంతరం ధర్మారం ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సిబ్బంది హాజరు వివరాలను పరిశీలించారు. కార్యాలయ పని వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమయపాలన పాటించాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని సిబ్బందికి సూచించారు.
ఈ పర్యటనలో ధర్మారం తహసీల్దార్ శ్రీనివాస్, టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ ప్రిన్సిపాల్ పద్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
