అకాల వర్షాల మధ్య ధాన్యం కొనుగోళ్లు ఆగవు…
–చివరి గింజ వరకు కొనుగోలు చేయాలి…
–కలెక్టర్ కోయ శ్రీ హర్ష…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:పెద్దపల్లి, జిల్లాలో కురిసిన అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు ఎక్కడా ఆగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు.
టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ధాన్యం కొనుగోళ్లు, వర్షాల ప్రభావంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్, రైతుల వద్ద ఉన్న చివరి గింజ వరకు మద్దతు ధరతో కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.
వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించవద్దని, ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం బాయిల్డ్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోళ్లు వేగవంతం చేయడానికి ప్రతి మండలానికి ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు.
రైతులు ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్ని ఎండబెట్టి సమీప పీపీసీ కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తగినంత తార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాలని చెప్పారు.
ప్రభుత్వం రైతులకు పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని, ప్రతి ధాన్య గింజ కొనుగోలు చేయబడుతుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు.
ఈ టెలీ కాన్ఫరెన్స్లో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY