అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి గడ్కరీ
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశం సుసంపన్నంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
ముందుగా ఆలయం వద్ద రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, టీటీడీ ఈవో జె.శ్యామల రావు, జేఈవో వీరబ్రహ్మం కేంద్ర మంత్రి గడ్కరీకి స్వాగతం పలికారు. ఆలయంలోకి చేరుకున్నాక ధ్వజస్తంభానికి మొక్కులు చెల్లించారు. అనంతరం ఆయన దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనాలతో మంత్రి దంపతులను ఆశీర్వదించారు. అనంతరం ఆశీర్వాద మండపంలో కేంద్ర మంత్రికి టిటిడి ఈవో అమ్మవారి ప్రసాదాలు, వస్త్రాలను అందచేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు గుడిపల్లి భాను ప్రకాష్ రెడ్డి, బీజేపీ నేతలు గాలి పుష్పలత, గుండాల గోపినాథ్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, అర్చకులు బాబు స్వామి, ఏఈవో దేవరాజులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
