తొలిసారిగా కె.నగరంలో వరమహాలక్ష్మీ వ్రతం
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: టీటీడీకి అనుబంధంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గం లోని కార్వేటినగరం శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి సన్నిధానంలో వరమహాలక్ష్మీ వ్రతాన్ని తొలిసారిగా ఈ ఏడాది 8వ తేదిన (శుక్రవారం) నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు అంగరంగవైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ పర్వదినాన శ్రీ వరమహాలక్ష్మీ వ్రతంలో పాల్గొనదలచిన భక్తులు (ఇద్దరికి) రూ.500 చెల్లించి ఆన్ లైన్ లోనూ, ఆఫ్ లైన్ లోనూ ఆలయం వద్ద పొందవచ్చు. వ్రతంలో పాల్గొన్న గృహస్థులకు ఉత్తరీయం, రవికె, లడ్డు, అప్పం, బ్యాగ్, కుంకుమాది ప్రసాదములు బహుమానంగా అందజేస్తారు.
నేటినుంచే వేణుగోపాల స్వామివారి తెప్పోత్సవాలు
కార్వేటినగరం శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో బుధవారం(నేటి) నుంచి 8వ తేదీ వరకు తెప్పోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.
ఇందులో భాగంగా మొదటి రోజు బుధవారం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు, 7, 8వ తేదీల్లో శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారు సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
ఈ మూడు రోజుల పాటు ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5 నుంచి 6.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
