ఎర్త్ డే సందేశం: పర్యావరణ రక్షణే భవిష్యత్కు భరోసా….
పెద్దపల్లిలో అవగాహన పోస్టర్ ఆవిష్కరణ – ప్లాస్టిక్ తగ్గించి పచ్చదనం పెంపుదలకు పిలుపు….
సాక్షిత పెద్దపల్లి//
జాతీయ ఎర్త్ డే సందర్భంగా పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయంలో పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ప్రత్యేక పోస్టర్ను ఆవిష్కరించారు. కలెక్టరేట్ పరిపాలన అధికారి బండి ప్రకాష్ ఈ కార్యక్రమంలో పాల్గొని పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్ను నేషనల్ గ్రీన్ క్రాప్స్ (ఎన్ జి సి ), పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సంయుక్తంగా రూపొందించారు.
ఈ సందర్భంగా బండి ప్రకాష్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. చెట్ల పెంపకం, నీటి సంరక్షణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు వంటి అంశాల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, హరిత వాతావరణాన్ని అందించేందుకు సమాజంలోని అన్ని వర్గాలు కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల వద్ద ఈ పోస్టర్ను ప్రదర్శించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి జి. శారద, అకాడమిక్ మానిటరింగ్ అధికారి పి.ఎం. షేక్, ఎస్సీ వెల్ఫేర్ అధికారి రవీందర్, ఎస్టీ వెల్ఫేర్ అధికారి, జిల్లా పరీక్షల అధికారి శ్రీ హనుమంతు, జి.సి.డి.ఓ అధికారి కవిత, నేషనల్ గ్రీన్ క్రాప్స్ జిల్లా కోఆర్డినేటర్ గూళ్ల అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

