ధరల పెరుగుదల, లేబర్ కోడ్‌లపై సీపీఐ సమరశంఖం

Sakshitha news

ధరల పెరుగుదల, లేబర్ కోడ్‌లపై సీపీఐ సమరశంఖం
కామన్‌పూర్‌లో సీపీఐ పాదయాత్ర….

11న.బహిరంగ సభను జయప్రదం చేయాలి…

— కందుకూరి రాజరత్నం…

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, పెద్దపల్లి/ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రజా పాదయాత్రను విజయవంతం చేయాలని సీపీఐ కమాన్‌పూర్ మండల కార్యదర్శి కందుకూరి రాజరత్నం పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా 8వ. కాలనీలోని ఏఐటీయూసీ యూనియన్ కార్యాలయంలో సీపీఐ పాదయాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను పార్టీ నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం ధరల పెరుగుదలతో పాటు కార్మికులకు నష్టం కలిగించే విధంగా లేబర్ కోడ్‌లను అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలను మరింత ఉధృతం చేయాలని సీపీఐ నిర్ణయించిందని తెలిపారు.

ప్రజా సమస్యలను ప్రజలకు వివరించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలపై అవగాహన కల్పించేందుకు సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలోనూ ప్రజా పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు.

ఆగస్టు 11, మంగళవారం సాయంత్రం 4 గంటలకు కమాన్‌పూర్ మండల కేంద్రానికి సీపీఐ పాదయాత్ర చేరుకోనున్నట్లు కందుకూరి రాజరత్నం తెలిపారు. అనంతరం 8వ కాలనీలో నిర్వహించనున్న బహిరంగ సభకు ప్రజలు, కార్మికులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో ఆవుల రవికుమార్, నల్ల మదన్న, ఎం. మహేందర్, తాళ్లపల్లి నారాయణ, జాడి ఆంజనేయులు, సాగే కృష్ణ, అక్రం, సాంబన్న, అనిల్, రాయలింగు గట్టయ్య, పోషం, నీలం మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.