మొక్కజొన్న రైతులకు లారీలు గన్ని బ్యాగుల కొరత తీర్చాలనీ సిపిఐ డిమాండ్
సాక్షిత వనపర్తి : వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న రైతులు లారీలు, గన్ని బ్యాగుల కొరత తీర్చాలని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కే శ్రీరామ్ డిమాండ్ చేశారు. వనపర్తి మార్కెట్ యార్డును సందర్శించి మొక్కజొన్న వరి రైతుల ఇబ్బందులను తెలుసుకున్నారు. మాట్లాడుతూ.. వనపర్తి మార్కెట్ యార్డులో మొక్కజొన్నలు కొనుగోలు చేయక పేరుకుపోయాయన్నారు. కొన్నింటినితూకం వేసి నెలరోజులైనా లారీలు రాక తరలించలేదని రైతులు వాటి వద్ద రాత్రి పగలు కావలి కాస్తున్నారన్నారు. మార్కెట్లో పెద్ద మొత్తంలో మొక్కజొన్నలు అలాగే ఉన్నాయని గన్ని బ్యాగులు లేక కాంటాలు వేయలేదని,ఖాళీ సంచులు తెస్తే తూకం వేస్తామని అధికారులు చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఖాళీ సంచులు కొనాలని గణపురం మండలం అప్పారెడ్డిపల్లి రైతుల నుంచి 1100 ఖాళీ సంచుల కోసం రూ. 33000 వసూలు చేశారన్నారు.
వరి వేరుశనగ రైతులకు ఉచితంగా ఖాళీ సంచులు ఇస్తున్నారని మక్కజొన్న రైతుల వద్ద డబ్బులు వసూలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. డబ్బులు వాపస్ ఇవ్వాలని తగినన్ని ఖాళీ సంచులను ఉచితంగా సరఫరా చేయాలన్నారు. మద్దతు ధరరూ.2400 కొంత సరుకు మాత్రమే కొన్నారని, తక్కిన వాటిని రైతులు రూ. 1700లకే ప్రైవేటు వారికి అమ్ముతున్నారని మొత్తం సరుకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పార్టీ ఆధ్వర్యంలో రైతులను సమీకరించి ధర్నా చేస్తామని హెచ్చరించారు. గణపురం గోపాల్పేట వనపర్తి మండల రైతులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
