ఎంపీ గురుమూర్తిని కలిసిన కాటన్ మిల్లు ఉద్యోగులు
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: రేణిగుంట రోడ్డులోని కాటన్ మిల్లు ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తిని మంగళవారం కలిసి తమ సమస్యలను వివరించారు. మిల్లు మూతపడిన తర్వాత తమకు రావాల్సిన జీతాలు, పీఎఫ్, గ్రాట్యూటీ వంటి బకాయిలు ఇంకా చెల్లించకపోవడం వలన తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. 1997 నుంచి పనిచేస్తున్న ఉద్యోగులకు ఇప్పటివరకు గ్రాట్యూటీ చెల్లించలేదని, 110 మంది శాశ్వత ఉద్యోగులకు గత 10 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం తీవ్ర అన్యాయమని ఎంపీకి వివరించారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పూర్తి గ్రాట్యూటీ ఇవ్వలేదని, వారికి కేటాయించిన క్వార్టర్లు శిథిలావస్థలో ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ సమస్యలను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని కోరుతూ ఎంపీకి వినతిపత్రం సమర్పించారు. గతంలో తమ పక్షాన నిలబడి ఈ సమస్యలను పార్లమెంట్లో పలుమార్లు ప్రస్తావించి, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినందుకు ఎంపీ గురుమూర్తికి ఉద్యోగులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అప్పటి కేంద్ర జౌళి శాఖా మంత్రి పీయూష్ గోయల్ను కలిసి ప్రత్యేకంగా కోరిన విషయాన్ని గుర్తు చేశారు. మిల్లు పునరుద్ధరణకంటే ముందుగా పెండింగ్లో ఉన్న జీతభత్యాలు, పీఎఫ్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరగా, ఆ సమయంలో ప్రభుత్వం మొత్తం బకాయిలను చెల్లించి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఉద్యోగుల సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కరించబడక పోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యను మరోసారి పార్లమెంట్ వేదికగా బలంగా వినిపించి, ఉద్యోగులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని ఎంపీ గురుమూర్తి వారికి హామీ ఇచ్చారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
