ఉల్లి రైతుల కోసం సీఎం చారిత్రాత్మక నిర్ణయం
** వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు
…..
సాక్షిత ప్రతినిధి – అమరావతి / తిరుపతి: రాష్ట్రంలోని ఉల్లి రైతులు ఆధైర్యపడాల్సిన అవసరం లేదని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం పక్కా చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. ఉల్లి ధరలు పతనమైనప్పుడు రైతులు పడిన శ్రమ వృథా కాకుండా ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా ఉల్లిని కొనుగోలు చేసింది. రాష్ట్రంలోని ఉల్లి రైతులు ఏ విధంగానూ నష్టపోకుండా రక్షించాలనే భావనతో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారని, ఒక క్వింటాకు రూ.1200 పెట్టి మార్కెటింగ్ శాఖతో పాటు మార్క్ఫెడ్ ద్వారా కర్నూలు మార్కెట్లో సుమారు 18 కోట్ల విలువ గల ఉల్లిని ప్రభుత్వం సేకరించిందని, ఇప్పటికే 10 కోట్ల నగదును రైతుల ఖాతాలలో జమ చేసామని, మిగిలిన 8 కోట్లను అతి త్వరలోనే రైతులకు అందచేయనున్నట్లు మంత్రి తెలిపారు. కేవలం మార్కెట్ జోక్యం ద్వారా ఉల్లి కొనుగోలు ఒక్కటే రైతులని ఆదుకోలేదని సీఎం చంద్రబాబు గ్రహించి గతంలో ఏ ప్రభుత్వం తీసుకోనటువంటి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని ప్రతి హెక్టారుకు 50 వేలు అందచేయాలని నిర్ణయించారని, దీనితో వేలాది మంది లబ్ది పొందుతారని పేర్కొన్నారు. ముఖ్యంగా కర్నూలు, కడప రైతులు పంట పాడై భారీ నష్టాల బారిన పడకుండా ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకుందని వివరించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా, ఉల్లి రైతులకు హెక్టార్కు రూ.50,000 చొప్పున నష్టపరిహారం అందించేందుకు తీసుకున్న నిర్ణయం రైతుకు నిజమైన అండగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో కర్నూలు జిల్లాలో 15232 హెక్టార్లలో, 23316 మంది రైతులకు 76.16 కోట్లు, కడప జిల్లాలో 5681 హెక్టార్లలో, 6400 మంది రైతులకు 28.41 కోట్లు మొత్తంగా 20,913 హెక్టార్లలో, 29,716 మంది రైతులకు రూ.104.57 కోట్ల రూపాయల లబ్ధి పొందబోతున్నారని, త్వరలోనే డబ్బులను రైతులకు అందచేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హమీ ఇచ్చారు. రైతుల ప్రయోజనాలే తమ ప్రభుత్వానికి ప్రాధాన్యమని, ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉల్లి పంటకు సంబంధించిన సమస్యలను ఆయా జిల్లాలో ప్రత్యేకంగా మానిటర్ చేయడానికి ప్రక్రియ మొదలుపెట్టామని అన్నారు. వాతావరణ మార్పులు, అనుకోని మార్కెట్ పరిస్థితులు వచ్చినా కూడా ప్రభుత్వం రైతు పక్షానే నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఉల్లి రైతులు ధైర్యంగా ఉండాలి. మీ సమస్యలు మా సమస్యలే. పంటకు తగిన రక్షణ, సరైన ధర కల్పించేందుకు ప్రభుత్వం మీతో ఉంది అని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.
