చంద్రన్న కలిసిన ప్రశాంతమ్మ
కోవూరు నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు మరియు పెండింగ్లో ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అమరావతిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పలు ప్రధాన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి
వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా కనిగిరి రిజర్వాయర్ ఆధునీకరణ పనులను త్వరితగతిన చేపట్టాలని కోరారు. అలాగే ముదివర్తి నుండి ముదివర్తి పాళెం వరకు కాజ్వే నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, గంగపట్నం పల్లిపాలెం గ్రామంలో ఉప్పుటేరు వంతెన నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ముఖ్యమంత్రికి సమర్పించిన వినతిపత్రంలో విన్నవించారు.
వీటితో బుచ్చిరెడ్డిపాలెం ఫైర్ స్టేషన్కు అదనపు సిబ్బందిని నియామకంతో పాటు నిరుపేదల ఆరోగ్య సహాయానికి సంబంధించి పెండింగ్లో వున్న సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులను పునఃపరిశీలించి వైద్య సహాయం ఫైళ్లను త్వరితగతిన క్లియర్ చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విన్నవించిన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. కనిగిరి రిజర్వాయర్ మరియు వంతెనల నిర్మాణానికి సంబంధించి వెంటనే అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
