రూ.60 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం…
4వ.డివిజన్ అభివృద్ధికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హామీ….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:గోదావరిఖని, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 4వ.డివిజన్లో స్పెక్ట్రా స్కూల్ సమీపంలో రూ.60 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి, నాణ్యమైన రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి వంటి అన్ని మౌలిక సదుపాయాలను ప్రజలకు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రామగుండం నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్, 4వ డివిజన్ కార్పొరేటర్ కంకణాల మౌనిక రాజు, పలువురు కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


